Gruhalakshmi Housing Scheme (Photo : Google)
Gruhalakshmi Housing Scheme Guidelines : తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేయనుంది. అదే గృహలక్ష్మి స్కీమ్. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయనుంది సర్కార్. కాగా, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు విడుదల చేసింది కేసీఆర్ గవర్నమెంట్. ఈ మేరకు జీవో ఎంఎస్ 25 విడుదల చేసింది. మహిళ పేరుపై ఇల్లు మంజూరు చేయనున్నారు.
ఇంటిని లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ లో నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లబ్దిదారుల కుటుంబం ఫుడ్ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాల్లో కలెక్టర్లు, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలు చేయనున్నారు. రెండు గదులతో ఆర్సీసీ ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది.
గృహలక్ష్మి పథకం గైడ్లైన్స్:
* గృహలక్ష్మి పథకం విధివిధానాలను విడుదల చేసిన ప్రభుత్వం
* సొంత స్థలం ఉన్న పేదల ఇంటి నిర్మాణానికి 100% రాయితీతో 3 దశల్లో రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల సాయం.
* కలెక్టర్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 3వేల చొప్పున లబ్ధిదారుల ఎంపిక.
* మహిళల పేరు మీద ఈ ఆర్ధిక సాయం అందిస్తారు.
* తప్పనిసరిగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలి.
* సొంత డిజైన్తో ఇల్లు కట్టుకునేందుకు అనుమతి.
* రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం.
* రాష్ట్ర రిజర్డ్ కోటాలో 43వేల మందికి, మొత్తంగా 4లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం.
* కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.
* మహిళల పేరు మీదే ఆర్థిక సాయం. ఇందుకోసం లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి.
* జన్ధన్ ఖాతాను వినియోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
* రెండు గదులతో ఆర్సీసీ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థికసాయం.
* ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం సాయం చేస్తుంది.
* ఆహార భద్రత కార్డు, సొంత స్థలం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.
* ఇప్పటికే ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారు, 59 ఉత్తర్వులు కింద లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
గృహలక్ష్మికి రూ.7వేల 350 కోట్లు
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కేసీఆర్ ప్రధాన ఆశయమని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన జీవోను విడుదల చేయం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల ఇళ్ల నిర్మాణం జరగనుందని చెప్పారు. ఇందుకోసం రూ.7వేల 350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు.