New Aasara Pension : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి వారందరికీ పింఛన్లు.. ఈ పత్రాలు లేకపోతే ఇక అంతే..!
New Pensions : తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 2 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
- Dharani Pilli
- Updated on- May 19, 2026 / 12:10 PM IST
Telangana Government To Distribute 2 Lakh New Aasara Pensions From June 2 Application Process
Aasara Pension : తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్లు (Aasara Pension) పంపిణీ చేస్తామని ప్రకటించారు.. మిర్యాలగూడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని చెప్పారు. అలానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో కొత్తగా ఎలాంటి పింఛన్లు మంజూరు చేయలేదని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో 42 లక్షల మందికి పైగా ప్రజలకి చేయూత, ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు వీటికి అదనంగా దాదాపు 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు జూన్ 2 నుంచి పింఛను ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకటించారు. వీరు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగుల వంటి వివిధ వర్గాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం పింఛను లబ్ధిదారులకు నెలకు రూ.2,016 లభిస్తుండగా, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున పింఛను ఇస్తున్నారు.
*ఏపీ ప్రభుత్వం శుభవార్త.. జూన్ 12 నుంచి ఆ 1.53 లక్షల మందికి కొత్త పింఛన్లు
అయితే కొత్త పింఛన్లు మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సవాలుతో కూడుకున్న విషయంగా మారిందన్నారు మంత్రి వివేక్. తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందున ఖజానా మీద ఆర్థిక భారం పెరుగుతుందన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 12 లక్షలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కేవలం అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయడానికి వీలుగా దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, వడపోత (ఫిల్టర్) చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు:
గ్రామసభలు, ప్రజావాణి కేంద్రాల ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
లబ్ధిదారులను ఆమోదించే ముందు కావాల్సినవి:
- ఆదాయ వివరాలు,
- ఆధార్ కార్డు
- దివ్యాంగులకైతే సదరం (SADAREM) సర్టిఫికెట్.
- లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వివరాలు
దళారీల పాత్రను తగ్గించి, పారదర్శకతను పెంచేందుకు పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేస్తున్నారు.
ఈ పింఛను పథకానికి అర్హులవ్వాలంటే ఈ క్రింది మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది:
వయస్సు:
- వృద్ధులకు కనీసం 65 ఏళ్లు ఉండాలి.
- వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, మరియు గీత కార్మికులకు 50 ఏళ్లు దాటి ఉండాలి.
- దివ్యాంగులకు (వికలాంగులకు) ఎటువంటి వయోపరిమితి లేదు.
ఆదాయం:
కుటుంబం యొక్క వార్షిక ఆదాయం దారిద్య్ర రేఖకు (BPL) దిగువన ఉండాలి.
నివాసం:
దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసితులై ఉండాలి.
