HighCourt Shocks Smita Sabharwal : రూ.15లక్షలు తిరిగి ఇచ్చేయండి.. స్మితా సబర్వాల్‌కు హైకోర్టు షాక్

పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారి, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.

HighCourt Shocks Smita Sabharwal : పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారి, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో కోర్టు ఫీజుల కోసం ప్రభుత్వం ఇచ్చిన రూ.15లక్షలు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించింది. పరువు నష్టం దావా కేసులో కోర్టు ఫీజుల కోసం స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం నిధులివ్వడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

2015లో ఔట్ లుక్ మ్యాగజైన్ తన ఫొటోను అవమానకరంగా ప్రచురించిందని ఆరోపిస్తూ అవుట్ లుక్ మ్యాగజైన్ పై స్మితా సబర్వాల్ పరువు నష్టం కేసు వేశారు. రూ.10 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనికి సంబంధించి కోర్టు ఫీజుల కోసం తెలంగాణ ప్రభుత్వం స్మితా సబర్వాల్ కు రూ.15లక్షలు మంజూరు చేసింది.

Telangana High Court Directs Smita Sabharwal To Refund 15 Lakh Rupees

కాగా, నిధుల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వం తీరుని తప్పుపడుతూ అవుట్ లుక్ తో పాటు ఇతర వ్యక్తులు వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించడాన్ని సవాల్ చేశారు. ప్రజాధనాన్ని ఆమెకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలతో ఏకీభవిస్తూ.. స్మితా సబర్వాల్ కు షాక్ ఇచ్చింది. 90 రోజుల్లోపు ఆ డబ్బుని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని స్మితా సబర్వాల్ ను కోర్టు ఆదేశించింది.

విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలపై కేసు వేస్తే అది ప్రజాప్రయోజనం కిందకు రాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నిర్ణయం అసంబద్ధంగా ఉందని, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే, కోర్టులు సమీక్షించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు