Inter Exams Schedule : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల తేదీలు ఖరారు.. మొదటి సంవత్సరంలోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్..
Inter Exams Schedule : తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
- Harishth Thanniru
- Published On : October 25, 2025 / 12:24 PM IST
Inter Exams Schedule
Inter Exams Schedule : తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ సిలబస్ లోనూ మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో ఫస్ట్ ఇయర్ లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి.
నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 12 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ 30 మార్కులు మొదటి సంవత్సరంలో కూడా తీసుకు వస్తున్నామని చెప్పారు. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు భాగస్వాములవుతారని, NCERT ప్రకారం సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పు చేస్తున్నామని చెప్పారు. నలబై నుండి నలబై ఐదు రోజుల్లో దీన్ని పూర్తిచేస్తామని కృష్ణ ఆధిత్య చెప్పారు.
ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం.. డిసెంబరు 15 నాటికి సిలబస్ను తెలుగు అకాడమీకి అందిస్తామని అన్నారు. ఏప్రిల్ నెల చివరి నాటికి సిలబస్ మారిన బుక్స్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నూతన సిలబస్తోపాటు క్యూఆర్ కోడ్ ముద్రణ ఉంటుందని అన్నారు. ఎకౌంటెన్సీ గ్రూపు రూపకల్పన తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నామని చెప్పారు. రాబోయే 45రోజుల్లో ఆ కమిటీలకు అప్పగించిన పని పూర్తవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.
ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3వ తేదీ నుండి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయని, ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్ పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయని.. మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. అయితే, పరీక్షల షెడ్యూల్ త్వరలోనే వస్తుందని అన్నారు. ఈసారి ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్తో పాటు ఇతర భాషల్లో కూడా ఉంటాయని, ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు కూడా ఉంటాయని చెప్పారు. 2026 నుంచి కొత్త గ్రూప్ ఏసీఈ గ్రూప్ ప్రారంభం అవుతుందని, నవంబర్ 1 నుంచి ఎగ్జామ్ ఫీ కలెక్ట్ చేస్తున్నామని తెలిపారు.
