Telangana Corona Cases : తెలంగాణలో కరోనా విజృంభణ.. భారీగా కొత్త కేసులు నమోదు
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. నిన్నటితో (1,825) పోలిస్తే 100 కేసులు పెరిగాయి.
- Naveen
- Updated on- January 12, 2022 / 07:25 AM IST
Telangana Corona Cases
Telangana Corona Cases : తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీ, తెలంగాణలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. నిన్నటితో (1,825) పోలిస్తే 100 కేసులు పెరిగాయి.
గడిచిన 24 గంటల్లో 83వేల 153 కరోనా టెస్టులు చేయగా 1,920 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,045కి చేరింది. మరోవైపు కోవిడ్ నుంచి 417 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16వేల 496 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,97,775కి చేరింది.
కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగించింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంక్షలు కఠినతరం చేసింది ప్రభుత్వం.
రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో, షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా , వ్యాపార సంస్థల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరి మాస్కు ధరించాలి. మాస్కు లేదంటే రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం విధించింది ప్రభుత్వం.
