Telangana Speaker: ఫిరాయింపులపై యాక్షన్ షురూ చేసిన తెలంగాణ స్పీకర్.. ఆ పది మందికి నోటీసులు..! ముగ్గురిపై వేటు? ఇప్పుడు దీనిపైనే ఉత్కంఠ

ఆ అవకాశమే ఇవ్వొద్దని స్పీకర్‌ అనుకుంటే..దానం, కడియం, తెల్లం మీద వేటు వేయకతప్పదన్న చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ సీటు ఖాళీగా ఉంది.

Telangana Speaker

Telangana Speaker: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేస్తున్నారు. బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌ గూటికి చేరిన పది ఎమ్మెల్యేల వ్యవహారం..ముందుగా హైకోర్టు..ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కి..తిరిగి శాసనసభకు చేరుకుంది. లేటెస్ట్‌గా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్‌ ప్రకారం స్పీకర్ పది మంది జంపింగ్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారంలో ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్‌ కుమార్, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌లపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్​న్యాయపోరాటం చేస్తోంది.

ఈ క్రమంలోనే స్పీకర్ ఆఫీస్‌ నుంచి ఎమ్మెల్యేలకు నోటీసులు అందుతున్నాయి. ఈ పది మందిలో ఏడుగురు మాత్రం తాము కాంగ్రెస్‌లో చేరలేదు దేవుడి కండువాలు కప్పుకున్నామని చెప్తున్నారు. (Telangana Speaker)

Also Read: Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ ఏపీలో పొలిటికల్‌ ట్విస్ట్‌లు..! 

నోటీసులు అందుకున్న వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. నోటీసులపై ఆయన స్పందించారు. స్పీకర్ ఆఫీస్‌ నుంచి నోటీసు అందినట్లు తెలిపిన ఆయన..న్యాయనిపుణులతో చర్చించి, స్పీకర్‌కు వివరణ ఇస్తానన్నారు.

తాను పార్టీ మారలేదని, టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకొస్తున్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశానని అంటున్నారు. గతంలో తన ఫోటోను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో వేయడంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా ట్విస్ట్ ఇచ్చారు కృష్ణమోహన్‌రెడ్డి.

ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రచారం

కృష్ణమోహన్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదనే అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురి విషయంలో కొంత స్పష్టత కనిపిస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి..లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా కంటెస్ట్ చేశారు. దీంతో ఫిరాయింపు విషయంలో దానం నాగేందర్ క్లియర్‌గా దొరికిపోయినట్లు అయింది. ఇక మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రచారం చేశారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంకట్రావు ప్రచారం చేసిన వీడియోలు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఫిరాయింపుల పరిధిలోకి రావడం ఖాయమన్న చర్చ ఉంది. కడియం శ్రీహరి తన కూతురు కావ్యను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బలపరుస్తూ బీఫామ్‌పై సంతకం చేశారని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఈ విధంగా కడియం శ్రీహరి కూడా ఫిరాయింపుల పరిధిలోకి వస్తారని చర్చ జరుగుతోంది.

ఇలా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అయితే ఫిరాయింపు విషయంలో ఇరికిపోయే అవకాశం ఉందని మొదటి నుంచి బీఆర్ఎస్‌ గట్టిగా నమ్ముతోంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తాము పార్టీ మారలేదని ఎక్కడా చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ నోటీసులపై దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎలాంటి రిప్లై ఇస్తారోనన్నది ఇంట్రెస్టింగ్‌ చర్చగా మారింది. వారు కాంగ్రెస్‌లో ఉన్నట్లుగా టెక్నికల్‌గా కొన్ని ఎవిడెన్స్ అయితే ఉన్నాయనే బీఆర్ఎస్‌ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తోంది.

అది అబద్ధమన్న విషయం ఓపెన్ సీక్రేటే

ఒకవేళ వారు పార్టీ మారలేదని స్పీకర్‌కు వివరణ ఇచ్చినా అది అబద్ధమన్న విషయం ఓపెన్ సీక్రేటే. ఎందుకంటే దానం కాంగ్రెస్‌ టికెట్‌ మీద ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. ఇక కడియం శ్రీహరి తన కూతురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే..బలపరుస్తూ బీఫామ్‌పై సంతనం చేశారని అంటున్నారు. తెల్లం వెంకట్రావు అయితే కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఇచ్చే రిప్లై..ఆ తర్వాత స్పీకర్‌ తీసుకునే చర్యలపైనే ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్‌ వేటు వేయకపోతే బీఆర్ఎస్‌ మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశం లేకపోలేదు.

ఆ అవకాశమే ఇవ్వొద్దని స్పీకర్‌ అనుకుంటే..దానం, కడియం, తెల్లం మీద వేటు వేయకతప్పదన్న చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ సీటు ఖాళీగా ఉంది.

బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్ బైపోల్‌కు ఎన్నికలు రావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి స్పీకర్ ఈ లోపే ఈ ముగ్గురి నుంచి వివరణ కోరి వేటు వేస్తారా.? లేక ఆ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రెడీ అవుతారా.? స్పీకర్‌ నోటీసులు..ఆ ముగ్గురు ఎమ్మెల్యేల రిప్లై తర్వాత డెవలప్‌మెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.