Telangana Red Alert : హైదరాబాద్ను కుమ్మేసిన భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ!
తెలంగాణలో భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
- Sreehari A
- Published On : July 15, 2021 / 09:45 AM IST
Telangana Under Red Warning Due To Possible Extreme Rains
Telangana IMD Red Alert : తెలంగాణలో భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో 20సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెగకుండా వర్షం కురుస్తూనే ఉంది.
కుండపోత వానకు రహదారులన్నీ నీటమునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసి పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వనస్థలిపురంలో 19.2, హస్తినాపురంలో 19 సెంటీమీటర్లు కురవగా.. భవానీనగర్ లో 17.9, హయత్ నగర్ లో 17.1 సెంటీమీటర్లు కురిసింది. రామంతాపూర్ లో 17.1, హబ్సిగూడలో 16.5 సెంటీమీటర్లు, నాగోల్ లో 15.6, ఎల్బీనగర్ లో 14.9 సెంటీమీటర్లు, లింగోజిగూడలో 14.6, ఉప్పల్ మారుతినగర్ లో 13.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం నీరు ఇళ్లలోకి వస్తుండడంతో కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.
మరోవైపు.. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
