Telugu States Hospitals Over Charging: తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రజలందరికీ కష్టాలు తెచ్చి పెట్టినా.. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. రోగుల నుంచి దోచుకుంటూనే ఉన్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు. దీంతో పలు ఆస్పత్రులపై తెలుగు ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే కంప్లైంట్స్పై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి.
ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులకు నోటీసుల జారీ, జరిమానాలు విధిస్తూ వచ్చింది. ఇకపై అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ రోగుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తే… పదిరెట్ల పెనాల్టీ విధించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. రెండోసారి కూడా ఇదేవిధమైన తప్పిదాలకు పాల్పడితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
మరోవైపు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వానికి 66 ఫిర్యాదులు అందాయి. వీటిలో 43 ఆస్పత్రులకు ప్రభుత్వం ఫైన్ వేసింది. 2కోట్ల 40 లక్షల రూపాయల జరిమానా విధించింది.
తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై చర్యలకు పూనుకుంది. అధికంగా ఫీజులు వసూలు చేస్తోన్న 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. ఐదు ఆస్పత్రుల్లో కోవిడ్ ట్రీట్మెంట్ను రద్దు చేసింది. మిగిలిన ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
కూకట్ పల్లి ఓమ్నీ ఆసుపత్రిపై అత్యధికంగా ఆరు ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత బేగంపేటలోని విన్ ఆసుపత్రిపై ఐదు ఫిర్యాదులు అందాయి. కాచిగూడలోని TX, అబిడ్స్లోని ఉదయ్ ఓమ్ని ఆసుపత్రులపై మూడు చొప్పున కంప్లైంట్స్ వచ్చాయి.