Weather forecast: ఈ సారి ఎండలు ఎలా ఉండనున్నాయ్? వర్షాకాలంలో వానలు ఎంతగా పడబోతున్నాయో తెలుసా?
ప్రస్తుత ఎండాకాలంలో మార్చి తొలి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది.
- T Venkateshwarlu
- Published On : March 9, 2025 / 04:47 PM IST
Weather forecast
ప్రస్తుతం భానుడి భగభగలతో జనాలు చెమటలు కక్కుతున్నారు. వేసవి కాలం ముగియకముందే వర్షాకాలం గురించి వాతావరణ శాఖ అధికారులు ఓ అప్డేట్ ఇచ్చారు. వచ్చే వర్షాకాలంలో భారత్లో సాధారణ వర్షపాతం ఉండవచ్చని తెలిపారు.
వచ్చే నెల మొదటి వారంలో దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒకవైపు, పగటి పూట ఎండలు తీవ్రత అధికంగా ఉంటుంది.. మరోవైపు, రాత్రి సమయంలో చలి తీవ్రత కూడా అధికంగా ఉంటుంది.
ఈ సంవత్సరం ఎల్నినో న్యూట్రల్ కండిషన్స్ ఉండనున్నాయి. ఈ విషయంపై ప్రపంచ వాతావరణ సంస్థ పలు వివరాలు తెలిపింది. గత డిసెంబర్లో లానినా పరిస్థితులు కొనసాగినప్పటికీ ఇప్పుడు అది బలహీనపడింది.
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా అధికమవుతున్నాయి. ఈ నెల నుంచి మే వరకు ఎల్నినో న్యూట్రల్ సిట్యువేషన్ 60 శాతం వరకు ఉండవచ్చు. ప్రస్తుతం లానినా పరిస్థితులు 40% వరకు ఉన్నాయి. దీంతో భారత్లో సాధారణ వర్షపాతమే నమోదయ్యే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అంటోంది.
మరోవైపు, ప్రస్తుత ఎండాకాలంలో మార్చి తొలి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. తెలంగాణలోని 301 మండలాలు హీట్ వేవ్స్ రికార్డయ్యే ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే వాతావరణ శాఖ అందరినీ అప్రమత్తం చేసింది. రాజస్థాన్ నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తుండం కూడా ఇక్కడ వేడి పెరగడానికి కారణమని అధికారులు అంటున్నారు.
