Green City Award For Hyderabad : హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డులను దక్కించుకుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంతోపాటు పచ్చదనం పెంపుకు తీసుకున్న చర్యలే ప్రధాన కారణం.
భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక నగరం మన హైదరాబాద్ కావడం విశేషం. మరో విభాగమైన లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్లో మరో అవార్డును అందుకుంది. నగర వాసులందరూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు, పరిష్కారాలను రూపొందించడంపై ఈ క్యాటగిరీ దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ర్టానికి గ్రీన్ నెక్లెస్గా పిలిచే ఓఆర్ఆర్ చుట్టూ పచ్చదనం పెంపుతో నగరం ఈ విభాగంలో ఉత్తమమైనదిగా ఎంపికైంది.
Hyderabad : మెట్రో నగరాల్లో పచ్చదనం పెంచటంలో హైదరాబాద్ టాప్
హైదరాబాద్కు ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) అవార్డులు లభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘గ్రీన్ సిటీ అవార్డు- 2022’, ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్’ అవార్డులను హైదరాబాద్ గెలుచుకున్న సందర్భంగా మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, స్పెషల్ సీఎస్ అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.
ఈ అంతర్జాతీయ అవార్డులు, తెలంగాణతోపాటు దేశ ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపజేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేస్తున్న హరితహారం, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు.. దేశానికి పచ్చదనపు ఫలాలు అందిస్తున్నాయనడానికి ఈ అంతర్జాతీయ అవార్డులే నిదర్శనమన్నారు. ప్రపంచ నగరాలతో పోటీ పడి దేశం నుంచి ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వించదగ్గ విషయమని చెప్పారు.
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా చేస్తున్న కృషి, అవలంబిస్తున్న పర్యావరణ సానుకూలత విధానాలు.. అటు తెలంగాణనే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ పచ్చదనం వేదికపై సగర్వంగా నిలిచేలా చేసిందన్నారు. ఇది యావత్ ప్రపంచం గర్వించదగ్గ విషయమని తెలిపారు. రాష్ట్రాన్ని మరింతగా ఆకుపచ్చ తెలంగాణగా మార్చుతూ, హరిత భారతాన్ని రూపుదిద్దే దిశగా కృషిని కొనసాగించాలని రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఎంట్రీలను అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఆహ్వానించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం తెలంగాణ ప్రభుత్వ నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్తో పాటు హెచ్ఎండీఏ బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు.