Nizamabad Thieves
Nizamabad – Thieves : వాళ్లంతా దొంగలు. ముఖానికి ముసుగులు ఉంటాయి. అర్థరాత్రి కాగానే రెచ్చిపోతారు. వాళ్ల టార్గెట్ కేవలం ప్రముఖ కార్ల కంపెనీల షో రూమ్ లే కావడం గమనార్హం. నగరంతో పాటు నగర శివార్లలోని కార్ల షోరూమ్ లో ముసుగు దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. క్యాష్ బాక్స్ లోని నగదుతో ఉడాయిస్తున్నారు.
నిజామాబాద్ లో ముసుగు దొంగలు హల్ చల్ చేస్తున్నారు. రాత్రి కాగానే దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగరంలోని ప్రముఖ కార్ల కంపెనీల షో రూమ్ లలో వరుస చోరీలు చేశారు. మారుతి నెక్సా, వరుణ్ మోటార్స్, ప్రకాశ్ హ్యుందాయ్, టాటా మోటర్స్ షో రూమ్ లతో పాటు మహీంద్ర మోటర్స్ షో రూమ్ లో చోరీకి పాల్పడ్డారు.
ఇనుప రాడ్లతో షోరూమ్ ల వెనుకభాగం నుంచి లోపలికి చొరబడి డబ్బులు ఉండే లాకర్లను ఎత్తుకెళ్లిపోయారు. మహింద్రా షోరూమ్ నుంచి రూ.2లక్షలు, హోండా షో రూమ్ నుంచి లక్షా 80వేలు, టాటా షో రూమ్ లో 3లక్షల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.
సాధారణంగా దొంగలు ఇళ్లు, బ్యాంకులు, దుకాణాలు, బంగారు షాపులు, ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతుంటారు. ఈ ముసుగు దొంగలు మాత్రం రూట్ మార్చి ప్రముఖ కార్ల కంపెనీల షోరూమ్ లపై పడ్డారు. కార్ల షో రూమ్ లలో వరుసగా చోరీలకు పాల్పడ్డారు. నగదు ఉంచిన బాక్సులను ఎత్తుకెళ్లిపోయారు. కార్ల షో రూమ్ లలో వరుస చోరీలతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు రాత్రి పూట నిఘా పెంచాలని, వెంటనే ముసుగు దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.