వాహనదారులపై మరో భారం, పెరిగిన టోల్ ఛార్జీలు.. కొత్త ధరలు ఇవే..
వాహనదారులపై మరో భారం పడింది. నేషనల్ హైవేలపై టోల్ చార్జీలు పెరిగాయి. ఒక్కో వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్ఠంగా
- Naveen
- Published On : April 1, 2021 / 08:06 AM IST
Toll Charges
Toll Charges Hike at Highways : అసలే పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలపై ఇప్పుడు మరో భారం పడింది. నేషనల్ హైవేలపై టోల్ చార్జీలు పెరిగాయి. ఒక్కో వాహనానికి రానుపోను కలిపి కనిష్ఠంగా రూ. 5 నుంచి గరిష్ఠంగా రూ. 25 వరకు, నెలవారి పాస్కు కనిష్ఠంగా రూ. 90 నుంచి గరిష్ఠంగా రూ.590 వరకు, లోకల్ పాస్కు రూ. 10 వరకు పెంచారు. హైదరాబాద్-విజయవాడ (65), హైదరాబాద్-భూపాలపట్నం (163) జాతీయ రహదారులను బీవోటీ పద్ధతిలో నిర్మించారు.
కాంట్రాక్ట్ సంస్థలు ఏడాదికోసారి టోల్ చార్జీలను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఎన్హెచ్ఏఐ ఆమోదంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి, గూడురు, నల్గొండ జిల్లాలోని కొర్లపహాడ్, ఏపీలోని జగ్గయ్యపేట చిల్లకల్లు జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల దగ్గర బుధవారం అర్ధరాత్రి నుంచే కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఏడాది కాలం పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ప్లాజా దగ్గర:
* కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్కు ఒకవైపు రూ. 80, ఇరువైపులా కలిపి రూ. 120..
* లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మినీ బస్సుకు ఒకవైపు రూ. 130, ఇరువైపులా కలిపి రూ. 190
* బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు ఒకవైపు రూ. 265, ఇరువైపులా కలిపి రూ. 395గా టోల్ చార్జి నిర్ణయించారు.
కొర్లపహాడ్ టోల్ప్లాజా దగ్గర:
* కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్కు ఒకవైపు రూ. 110, ఇరువైపులా కలిపి రూ. 165
* లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మిని బస్సుకు ఒక వైపు రూ. 175, ఇరువైపులా కలిపి రూ. 260
* బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు ఒక వైపు రూ. 360, ఇరువైపులా కలిపి రూ. 540గా నిర్ణయించారు.
హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారిపై గూడురు టోల్ప్లాజా దగ్గర:
* కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్కు ఒకవైపు రూ. 100, ఇరువైపులా కలిపి రూ. 150
* లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మినీ బస్సుకు ఒకవైపు రూ. 150, ఇరువైపులా కలిపి రూ. 225
* బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు ఒకవైపు రూ. 305, ఇరువైపులా కలిపి రూ. 460గా నిర్ణయించారు.
* భారీ, అతి భారీ వాహనాల రుసుములు కూడా రూ.20 నుంచి రూ. 35 వరకు పెరిగాయి.
