Trs By Election
Lingojiguda TRS By Election: టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు.
ఈ డివిజన్ కు ఉపఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఏకగ్రీవ ఎన్నిక కోసం సహకరించాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ సలహాతో టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.
ఏప్రిల్ 30న జరగనున్న ఉపఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవ ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ప్రగతిభవన్ లో కేటీఆర్ ని కలిసి విజ్ఞప్తి చేసింది.
ప్రమాణస్వీకారం కూడా చేయకముందే రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరం అని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టొద్దని బీజేపీ నుంచి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఈ ఉపఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్నందుక గాను కేసీఆర్, కేటీఆర్ లకు బీజేపీ బృందం కృతజ్ఞతలు తెలిపింది.