Komatireddy Rajagopal Reddy : బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేరిక ఖరారు..మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరటం ఖరారు అయ్యింది. ఆయన బీజేపీలోకి చేరే క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇక మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అయినట్లే.
- nagamani
- Updated on- July 27, 2022 / 12:45 PM IST
Komatireddy Rajagopal Reddy Into Bjp
Komatireddy Rajagopal Reddy into BJP: తెలంగాణ కాంగ్రెస్లో మునుగోడు రాజకీయం కొన్ని రోజులుగా రసవత్తరంగా కొనసాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కాషాయ కండువా కప్పుకుంటారంటూ వస్తున్న వార్తల క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైరానా పడుతున్నారు. అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి భేటీ తరువాత బీజేపీకి చేరటానికి ఆయన అన్నిరకాలుగా ఫిక్స్ అయ్యారు. కానీబయటకు మాత్రం ఏమాత్రం లీక్ ఇవ్వకుండా నివురుగప్పిన నిప్పులాగా రాజకీయాలను వేడెక్కించారు.
Also read : Komati Reddy : కాంగ్రెస్లో ‘కోమటిరెడ్డి’ టెన్షన్
తాను కాంగ్రెస్ వీడటంలేదంటూ చెప్పుకొచ్చిన రాజగోపాల్ రెడ్డి తెర వెనుక మాత్రం అన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి చేరటానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అన్ని ఖరారు అయ్యాక ఇక లాంఛనంగా కాషాయ కండువా కప్పుకోవటమే తరువాయిగా ఉంది. దీంట్లో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..ఈటల రాజేందర్, వివేక్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక రెండు మూడు రోజుల్లోనే మరోసారి ఢిల్లీకి వెళ్లి ముహూర్తం పెట్టేసుకోనున్నారు. ఆయన బీజేపీకి చేరితో కాంగ్రెస్ కు రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో మునుగోడుకు ఉప ఎన్నికలకు రంగం కూడా సిద్ధం కానుంది.
ఇప్పటికైతే బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గానీ, బీజేపీ వర్గాలు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ అంతర్గతంగా ఇరువురి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా పక్కా సమాచారం. బహుశా వచ్చే ఆగస్టులో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని తన అనుచరులు, కార్యకర్తలను రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ మారినా నియోజకవర్గంలో పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే పక్షంలో గతంలో హుజురాబాద్ మాదిరే మునుగోడుకు కూడా ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. బీజేపీలో చేరాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్న తరుణంలో మునుగోడుకు ఉపఎన్నిక జరిగితే అది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే 2023లో అధికారం తమదేనని ప్రచారం చేసుకోవడానికి మరింత స్కోప్ ఏర్పడుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి ఉపఎన్నికకు వెళ్లేందుకు బీజేపీ పక్కా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
