TS Inter Results 2024 Live Update : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.
రీ కౌంటింగ్, పేపర్ రీ వాల్యూయేషన్ కోసం ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు అవకాశం ఉందని, ఒక్కో పేపర్ కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
ఇంటర్ ఫలితాల కోసం tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్ సైట్ లలో చూడొచ్చు. లేదా 04024655027 నెంబర్ కు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.