Kukatpally Building Collapse : హైదరాబాద్ కూకట్ పల్లిలో భవన స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ విచారణ ప్రారంభించింది. జీ+2 కు మాత్రమే అనుమతి ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్ ను పక్కకు తోసి నాలుగు ఫ్లోర్ల నిర్మాణం చేపట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. నాలుగు అంతస్తులకు పర్మిషన్ లేదని భవన యజమానికి ఈ నెల 3వ తేదీన ఈ మేరకు నోటీసులు ఇచ్చామని అధికారులు అంటున్నారు.
అయినా తమ నోటీసులు పట్టించుకోకుండా మరో ఫ్లోర్ వేశారని తెలిపారు. అనుమతి లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్న వారిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్లాట్ ఓనర్ లక్ష్మణ్ రావుపై 304/2, 308 సెక్షన్ల కింద కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
Building Collapses: హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న భవన శ్లాబ్ కూలి ఒకరి మృతి.. మరికొందరికి గాయాలు
నిన్న కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం శ్లాబ్ కుప్పకూలింది. దీంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవన నిర్మాణ పనులు జరుగుతుండగా ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. పర్మిషన్ తీసుకున్న దానికంటే రెండు, మూడు ఫ్లోర్ల ఎక్కువ నిర్మాణం చేపడుతున్నారు. గతంలో ఓల్డ్ సిటీ, ఫిల్మ్ నగర్, కూకట్ పల్లిలో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. నిన్న జరిగిన ఘటనతో తీవ్ర కలకలం రేగుతోంది.