Amit Shah Meets Etela Rajender : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య ఏకాంత చర్చల అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే తన తండ్రిని కోల్పోయిన ఈటలను… అమిత్ షా పరామర్శించారు. అదే సమయంలో ఇద్దరి మధ్య 15 నిమిషాల పాటు చర్చ జరిగింది.
ఇద్దరి మధ్య చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈటలతో అమిత్ షా భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో చేరికలపైనే షా, ఈటల చర్చించి ఉండొచ్చని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ముందు మరిన్ని చేరికలు ఉంటాయని కమలనాథులు అంటున్నారు. అదే సమయంలో ఈటలను పరామర్శించేందుకు అమిత్ షా వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ పర్యటనలో కేంద్ర హోం మంత్రి బిజీబిజీగా గడిపారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లారు అమిత్ షా. హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలో ఉన్న ఈటల ఇంటికి వెళ్లిన అమిత్ షా ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. మరోవైపు, తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కీలక నేతలతో సమావేశమై మునుగోడు ఉప ఎన్నికపై చర్చించారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు షా. మునుగోడులో కచ్చితంగా గెలవాల్సిందేనని తేల్చి చెప్పారు అమిత్ షా.