Rain Alert : రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 13 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
- Harishth Thanniru
- Published On : April 20, 2024 / 02:17 PM IST
Rain
Weather Report Telangana : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం మారింది. గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఎండల తీవ్రత కాస్త తగ్గింది. శనివారం ఉదయం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతంతో వాతావరణం చల్లబడింది. తాజాగా వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. ద్రోణి కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేశారు. రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read : హైదరాబాద్ నగరంలో జోరు వాన.. ఏఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందంటే..
రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 13 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాటిలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ హనుమకొండ, వికారాబాద్ మహబూబాబాద్, ఖమ్మం సంగారెడ్డి ,నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి.
ఈ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలుసైతం కురిసే అవకాశం ఉందని.. ఈరోజు, రేపు రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
