President Election: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జులై 2న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 2న ఉదయం 11.30 గంటలకు యశ్వంత్ సిన్హా నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.అయితే హైదరాబాద్కు యశ్వంత్ సిన్హా రానున్న నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం పలకాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది.
Presidential polls: రాష్ట్రపతి ఎన్నిక కోసం 72 మంది నామినేషన్లు
జలవిహార్ లో జులై 2న నిర్వహించే యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పరిశీలించారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా పర్యటన షెడ్యూల్ను ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు. జులై2న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు యశ్వంత్ సిన్హా చేరుకుంటారని తెలిపారు. అక్కడ సీఎం కేసీఆర్, మంత్రులు, పలువురు ముఖ్య నాయకులు యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి జలవిహారం వరకు భారీ బైక్ ర్యాలీతో ఊరేగింపుగా యశ్వంత్ సిన్హాను తీసుకురానున్నారు. జలవిహార్లో సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత యశ్వంత్ సిన్హా మాట్లాడుతారని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. జలవిహార్లో సభ ముగిసిన తర్వాత యశ్వంత్ సిన్హా కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకు బయల్దేరుతారు.
Reviewed the arrangements being made to welcome opposition presidential candidate Shri @YashwantSinha who will visit Hyderabad on 2nd July, along with Ministers @YadavTalasani garu, @mahmoodalitrs garu, MLC @PRRTRS garu and Mayor @GadwalvijayaTRS garu.@trspartyonline @KTRTRS pic.twitter.com/pjhVr8GpTN
— Dr Ranjith Reddy – TRS (@DrRanjithReddy) June 30, 2022
ఇదిలాఉంటే జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్ లో ఉండనున్నారు. ఈ రెండు రోజులుపాటు భాగ్యనగరంలో బీజేపీ శ్రేణుల కోలాహలం నెలకొననుంది. ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తుండటం, ఆయన సీఎం కేసీఆర్, తెరాస మంత్రులు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.