YS Sharmila: ఈ విషయంపైనే సోనియాతో మాట్లాడాను.. చర్చలు కొలిక్కివచ్చాయి: వివరాలు తెలిపిన షర్మిల
తాను నిలబడతానని, అలాగే, తనతో వైఎస్సార్టీపీలో కొనసాగిన ప్రతి కార్యకర్తను నిలబెడతానని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : September 2, 2023 / 02:06 PM IST
YS Sharmila
YS Sharmila – Sonia Gandhi: ఢిల్లీ (Delhi) పర్యటనలో తాను కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలిశానని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఇవాళ ఆమె హైదరాబాద్లోని పంజాగుట్టలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అంతం కావాలన్న విషయంపైనే సోనియా గాంధీ తో చర్చలు జరిగాయని షర్మిల తెలిపారు. చర్చలు కొలిక్కి వచ్చాయని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. తాను నిలబడతానని, అలాగే, తనతో వైఎస్సార్టీపీలో నడిచిన ప్రతి కార్యకర్తను నిలబెడతానని అన్నారు.
ఎఫ్ఐఆర్ లో వైఎస్సార్ పేరు చేర్చిన సోనియాతో ఎందుకు కలుస్తున్నానని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. తాను ఈ అంశాన్ని సోనియా గాంధీ దగ్గర లేవనెత్తానని తెలిపారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత కూడా రాజీవ్ గాంధీ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని సోనియా గాంధీ చెప్పారని అన్నారు.
వైఎస్సార్ అంటే గాంధీ కుటుంబానికి చాలా ప్రేమ అని తెలిపారు. అందుకే తాను సోనియా, రాహుల్ తో చర్చలకు వెళ్లాని చెప్పారు. అందరికీ క్షమించే మనసు ఉండాలని, చర్చలు చివరి దశలో ఉన్నాయని అన్నారు. త్వరలో అన్ని విషయాలు చెబుతానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలని చెప్పారు.
తాను పాదయాత్రను ఒక యజ్ఞంలా చేశానని, ప్రజల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయి నేటికి 14 సంవత్సరాలు అయిపోయినా జనం గుండెల్లో ఆయన బతికే ఉన్నారని చెప్పారు. అప్పట్లో వైఎస్సార్ మరణవార్త విని 700 మంది చనిపోయారని, వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
