కోడెల బూత్ క్యాప్చరింగ్ చేయటానికి ప్రయత్నించారు : అంబటి

  • Publish Date - April 12, 2019 / 11:05 AM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనమెట్ల గ్రామంలో కోడెల శివప్రసాదరావుపై దాడి ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు స్పందించారు. ఆ గ్రామంలో వైసీపీకి పట్టు ఉందన్నారు. ఓ అభ్యర్థిగా పోలింగ్ బూత్ కు వచ్చిన కోడెల.. ఎందుకు తలుపులు మూశారని ప్రశ్నించారు. బూత్ క్యాప్చరింగ్ చేయటానికి ప్రయత్నించటంతోనే ప్రజలు తిరగబడినట్లు వెల్లడించారు. గత ఎన్నికల సమయంలోనూ కోడెలపై బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ కేసులు నమోదు అయిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆ కేసులు పోయాయని వివరించారు. అలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తికి.. పోలింగ్ బూత్ తలుపులు వేస్తే ఎవరికైనా అనుమానం వస్తుందన్నారు అంబటి.

గత ఎన్నికల్లో కోడల వ్యవహరించిన తీరు వల్లే ప్రజలు తిరగబడ్డారని.. ఇనమెట్లలో అతను వ్యవహరించిన తీరు వల్లే దాడి చేయటం జరిగిందన్నారు. అన్యాయం జరుగుతుంటే ప్రజలు ఎదిరించారని చెప్పుకొచ్చారు. బూత్ క్యాప్చరింగ్ చేయటానికి ప్రయత్నించటం వల్లే ఇలా జరిగిందని వెల్లడించారు.