ఏపీ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం జగన్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం జగన్ తెలిపారు. బుధవారం (డిసెంబర్ 4, 2019) సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. పోలీసు బీమా మరింతగా పెరిగిందని, దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్లో పెరుగుదల కనిపించిందని సీఎం జగన్ అన్నారు.
గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్ చెల్లిస్తుండగా.. ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచామన్నారు. అలాగే ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నామని తెలిపారు. డీఎస్పీ ఆ పైస్థాయి అధికారులకు రూ.45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్తోపాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే దానికింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచామని సీఎం జగన్ తెలిపారు.
ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షల రూపాయలను అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇందులో 64వేల 719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలు కానున్నాయని తెలిపారు.