ఏకగ్రీవం : ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా చంద్రశేఖర్రెడ్డి
- veegam team
- Published On : January 14, 2019 / 02:54 AM IST
అమరావతి: ఏపీఎన్జీవోల సంఘానికి కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన అధ్యక్షుడయ్యారు. ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం జిల్లాకు చెందిన బండి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 2019, జనవరి 13వ తేదీ ఆదివారం విజయవాడలోని ఏపీఎన్జీవో ఆఫీస్లో ఈ ఎన్నిక జరిగింది. అన్ని జిల్లాల రాష్ట్ర కార్యనిర్వాహక ప్రతినిధులు పాల్గొని వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానించారు. అప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న పి.అశోక్బాబు స్వచ్ఛంద పదవీవిరమణ చేయడంతో ఈ ఎన్నిక జరిగింది. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో అశోక్బాబు వీఆర్ఎస్ తీసుకున్నారు.
1985లో ఉద్యోగంలో చేరిన తాను వివిధ స్థాయిల్లో సంఘంలో పనిచేస్తూ వచ్చానని చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడే ఏపీ ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడిగా ఉంటారని, జేఏసీ నేతృత్వంలో అన్ని సంఘాలను ఏకతాటిపై నడిపిస్తామని చెప్పారు. కొత్త రాష్ట్రానికి, రాజధాని అభివృద్ధికి ఉద్యోగులమంతా సహకరిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల విషయంలో… 11వ పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగులకు 35శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
