నేడు సీఎం జగన్ చేతుల మరో పథకం: ఒక్కోక్కరికి రూ.24వేలు

  • Publish Date - December 21, 2019 / 04:10 AM IST

రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అండగా.. ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన పథకం ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’. చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే ఉద్ధేశ్యంతో రూపొందించిన ఈ పథకం నేడు(21 డిసెంబర్ 2019) సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 

చేనేతలను ఆర్థికంగా ఆదుకుని, హస్త కళలకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా మగ్గాలపై ఆధారపడి బతుకుతున్న వారికి, ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయంగా ఇవ్వనున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ(డిసెంబర్ 21) అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటివరకు 81,783 మంది నేతన్నలను గుర్తించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.196.27కోట్లను ఖర్చు పెడుతుంది. అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది.

అనంతపురం జిల్లా ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ.. ప్రకాశం జిల్లాలోని చీరాల, కందుకూరు.. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణాజిల్లా పెడన, నెల్లూరు జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, మదనపల్లి, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, వైఎస్సార్‌ జిల్లాలోని దొమ్మరనంద్యాల, వేపరాల, మాధవరం, అప్పనపల్లె వంటి పేరుగాంచిన పల్లెలు, పట్టణాల్లో ఎక్కువగా నేతన్నలు వస్త్రాలను తయారు చేస్తున్నారు.
 

ట్రెండింగ్ వార్తలు