లాక్‌డౌన్ బ్రేక్ పట్ల సీఎం జగన్ సీరియస్, నిత్యవసరాల కొనుగోలు సమయం తగ్గింపు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే

  • Publish Date - March 29, 2020 / 09:20 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే పలు చోట్ల ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీదకు వస్తున్నారు. ఏపీలోనూ పలు చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. లాక్ డౌన్ బ్రేక్ పట్ల సీఎం జగన్ సీరియస్ అయ్యారు. లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం(మార్చి 29,2020) అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, కోవిడ్-19 నివారణ, లాక్ డౌన్ అమలుపై తదితర అంశాలపై చర్చించారు.

మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌:
లాక్ డౌన్ నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కోసం సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మాత్రమే ప్రజలు బయటకు వచ్చి నిత్యవసరాలు కొనుగోలు చేయాలి. కాగా, ఇప్పుడా సమయాన్ని మరింత కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్బన్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం పాటిస్తున్న సమయాన్ని కుదించారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకే నిత్యావసరాల కోసం అనుమతి ఇస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు అనుమతి ఇస్తారు.

నిత్యవసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకే:
లాక్ డౌన్ నేపథ్యలో ప్రజలను దోచుకుని సొమ్ము చేసుకోవాలని వ్యాపారులు చూస్తే ఊరుకునేది లేదని సీఎం జగన్ హెచ్చరించారు. నిత్యవసరాలను ఎక్కువ ధరలకు అమ్మితే జైలుకి పంపిస్తామన్నారు. ప్రతి దుకాణం దగ్గర ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. అందులోనే ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ ఉండాలన్నారు. రేషన్‌ దుకాణాల దగ్గర సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ వాలంటీర్ల సర్వే పటిష్టంగా ఉండాలని, ప్రతి కుటుంబం వివరాలు కూడా ఎప్పటికప్పుడు నమోదు కావాలని సీఎం చెప్పారు.

కరోనా విస్తరిస్తున్న అర్బన్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి :
కరోనా విస్తరిస్తున్న అర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, అదనపు సిబ్బంది నియామకం జరగాలన్నారు. వ్యవసాయం, ఆక్వా, అనుబంధ రంగాల్లో సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. రైతులకు, ఆక్వా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు అందాలే చూడాలన్నారు. ఇక వలస కూలీలు, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లలో మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలన్నా చెప్పారు. గూడ్స్, ఎమర్జెన్సీ, అత్యవసర సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.