ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ చీఫ్ జగన్, ప్రధాని మోడీలపై విరుచుకుపడ్డారు. తనకు అనుకూలమైన వ్యక్తులను గెలిపించడానికి ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా కుట్రలు పన్నారని కేఏ పాల్ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకారంతో ఈవీఎంలలో సాంకేతికపరంగా మార్పులు చేయించారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు పడేలా ప్రభావితం చేశారని అన్నారు. ఏపీలో వైఎస్ జగన్ను గెలిపించడానికి ఇదే విధమైన కుట్రలు చేశారని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి శుక్రవారం (ఏప్రిల్ 12) సాయంత్రం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లారు. లోనికి వెళ్లడానికి పర్మిషన్ లేదని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ ఆగ్రహంతో అక్కడే నిరసనకు దిగారు.
ఏపీ ఎన్నికల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోటీ చేసిన నరసాపురం స్థానంలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 80 శాతం ఈవీఎంలు గురువారం(ఏప్రిల్ 11,2019) మధ్యాహ్నం వరకూ పనిచేయలేదన్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకూ పోలింగ్ నిర్వహించారని.. ఓటర్లందరూ నిరాశతో ఇంటికి తిరిగెళ్లాక వైసీపీ అభ్యర్థులకు అక్రమంగా ఓట్లు వేశారని పాల్ సంచలన ఆరోపణలు చేశారు. నరసాపురం, భీమవరంలో 45 చోట్ల ఈవీఎంలు పనిచేయలేదని తెలిపారు.
ఏపీలో కొన్ని ఈవీఎంలలో ఏ పార్టీకి ఓటేసినా.. వైసీపీ అభ్యర్థులకే ఓటు పడేలా మార్పులు చేశారని పాల్ ఆరోపించారు. 80 శాతం ఓటింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారని, నిజానికి చాలా మంది ఓటర్లు ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో పోలింగ్ కేంద్రానికి రెండు, మూడు సార్లు తిరిగి విసిగిపోయారని అన్నారు. కొంత మంది ఓటు కూడా వెయ్యలేదన్నారు. ఇదే అదనుగా అక్రమాలకు పాల్పడ్డారని పాల్ చెప్పారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని పాల్ వెల్లడించారు. ఎన్నికల్లో అక్రమాలపై శనివారం (ఏప్రిల్ 13) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. పాల్ చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.