దిశ చట్టం అమలుకు చర్యలు : సీఎం జగన్
- veegam team
- Published On : December 27, 2019 / 07:45 AM IST
దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఆయన ఆదేశించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. చట్టం చేసినా అమలుకావట్లేదన్న మాట ఎక్కడా రాకూడదని సూచించారు. దిశ చట్టం అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ చట్టానికి ఇప్పటికే కేబినెట్, అసెంబ్లీ, శాసన మండలి కూడా ఆమెదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం.. అత్యాచార కేసు నమోదైన 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి సరైన సాక్ష్యాధారాలు ఉంటే దోషులకు 21 రోజుల్లో శిక్ష అమలు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీసుకుని వచ్చిన దిశ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఈ చట్టంపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఈ చట్టంపై ప్రశంసలు కురిపించిన కేజ్రివాల్.. జగన్కు లేఖ కూడా రాశారు. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును పంపాలని లేఖలో కేజ్రీవాల్ కోరారు. ఏపీ దిశ చట్టం 2019పై ఢిల్లీ సర్కారు ఆసక్తి కనబరిచింది.
దిశ చట్టం కాపీ తమకు పంపాలని కేజ్రీవాల్ సర్కారు విజ్ఞప్తి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీకి ఇది గర్వకారణం అని అన్నారు. త్వరలోనే గవర్నర్ ఆమోదించిన దిశ చట్టం కాపీని ఢిల్లీ ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన ప్రకటించారు.
