ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్గా శ్రీనాథ్ దేవిరెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్గా శ్రీనాథ్ దేవిరెడ్డిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 8, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనాథ్ దేవిరెడ్డి.. జర్నలిజం వృత్తిలో ఎంతో అనుభవం కలిగి ఉన్నారు. శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్.. నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. కడప జిల్లాలో పని చేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ‘సెవెన్ రోడ్స్ జంక్షన్’ పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేష ప్రాచుర్యం పొందాయి.
1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా 24 సంవత్సరాలు పని చేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహిత జర్నలిస్టు శ్రీనాథ్ అని చెప్పవచ్చు.
ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించినందుకు సీఎం జగన్ కు శ్రీనాథ్ దేవిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలన్నా.. సీఎం జగన్ ఆశయ సాధన దిశగా పనిచేస్తానని చెప్పారు. డిజిటల్ యుగంలో మీడియా రంగంలో పెరిగిన ఆధునిక సాంకేతిక వినియోగం, అలాగే సోషల్ మీడియా విస్తృతమైన క్రమంలో ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టులకు సరైన దిశగా పునశ్చరణ అవసరమని, అందుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.