చిత్తూరు : చెవిరెడ్డి, నాని వర్గాల మధ్య ఘర్షణ
- veegam team
- Published On : April 11, 2019 / 09:42 AM IST
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కొత్తకండ్రిగలో టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. కొత్తకండ్రిగ గ్రామంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి భార్య పోలింగ్ బూత్ పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి నాని సైతం హుటాహుటిన అక్కడకి చేరుకున్నారు. నాని కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అతన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
దీంతో టీడీపీ వాళ్లు రెచ్చిపోయారు. రెండు వర్గాలు కొట్టుకున్నాయి. దాడులకు తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దాడిలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అడ్డుకున్న పోలీసులను సైతం వద్దల్లేదు ఆందోళనకారులు. ఎవరు ఎవర్ని కొడుతున్నారో.. ఏం జరుగుతుందో చాలాసేపు ఎవరికీ అర్థం కాలేదు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. సమీపంలోని పోలీస్ బలగాలను గ్రామానికి తరలించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘర్షణల్లో 9 మంది గాయపడ్డారు.
వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి సతీమణి, టీడీపీ అభ్యర్థి నానిని కొత్తకండ్రిగ గ్రామం నుంచి బయటకు పంపించారు.
