తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. 24 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో పాపికొండలకు వెళ్తోంది. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
అయితే పర్యాటకుల బోటుకు అనుమతి లేదని అధికారులు అంటున్నారు. ప్రమాదానికి గురైంది టూరిజం బోటు కాదని… వశిష్ట ప్రైవేట్ బోటు అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆ బోటుకు ఎవరూ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. టూరిజం శాఖ పర్మిషన్ ఇవ్వలేదని.. కాకినాడ పోర్టు ఫర్మిషన్ ఇచ్చిందని తెలిపారు. ఈ బోటును ప్రైవేట్ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి బోటును తిప్పుతున్నట్లు తెలిపారు.
రాయల్ వవిష్ట బోటు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత వరదలో అనుమతిలేని బోట్లు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు మొద్దునిద్ర వీడడం లేదు.
Also Read : బోటు ప్రమాదం: గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు