ప్రపంచమంతా ప్రేమే! ఒక్కోచోట ఒక్కోలా..కొత్తగా ప్రేమలో పడిన యువతీ యువకులు.. ఎప్పుడెప్పుడు తమ ప్రేమను తమ ప్రియుడు లేదా ప్రియురాలికి వ్యక్తం చేద్దామా అని ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక మన దేశంలో అయితే భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిబ్రవరి 14న చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ఆ రోజున ఎక్కడ, ఏ పార్కులో ప్రేమికులు జంటగా కనిపించినా అక్కడికక్కడే బలవంతంగా తాళి కట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు.
జంటలతో కళకళలాడే పార్కులు గురువారం(ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజున నిర్మానుష్యంగా మారిపోతాయి. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల్లో భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రేమజంటలు కనపడితే వివాహం చేస్తామని వాల్ పోస్టర్లలో హెచ్చరించడంతో స్థలాలు నిర్మానుషంగా ఉంటాయి.
ప్రేమ జంటలకు వేదికలైన నగరంలోని హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డులో పోలీసులు బందోబస్తును పెంచారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.