తిరుమల కొండపై త్వరలో వాటర్ బాటిల్స్ నిషేధం: వైవీ సుబ్బారెడ్డి

  • Publish Date - August 24, 2019 / 02:49 PM IST

తిరుమల : తిరుమల కొండపై  వచ్చే మూడు నెలల్లో వాటర్‌ బాటిళ్ల విక్రయాలను నిషేధిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపటుతున్నట్లు ఆయన తెలిపారు. ఈలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన తిరుమలలో ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, ఇతర అధికారులతో చర్చించారు. 

అనంతరం  విలేకరులతో మాట్లాడుతూ..  ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధంలో భాగంగా తొలి దశలో రెస్ట్‌హౌస్‌ల్లో నీళ్ల బాటిళ్ల నిషేధాన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి విశ్రాంతి గృహంలో నీటి క్యాన్లు ఏర్పాటుచేసి జలప్రసాదం నీటిని నింపుతామని తెలిపారు. తాగడానికి వీలుగా  పేపరు గ్లాసులను అందుబాటులో ఉంచుతామన్నారు. కొండపై ప్లాస్టిక్‌ నిషేధానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనికి వీఐపీలు, భక్తులు సహకరించాలని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ టీటీడీ ఆలయంలో లోకల్‌ అడ్వైజరీ కమిటీ చేసిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

గత టీడీపీ  ప్రభుత్వ హయాంలోనే ఢిల్లీలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విచారణ నివేదిక రాగానే అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.పాలక మండలి ఏర్పడ్డాక అన్ని లోకల్‌ అడ్వైజరీ కమిటీలను నియమిస్తామన్నారు. ఆగస్టు 31న టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలపై ఉన్నతస్థాయి సమావేశం జరగుతుందని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా భోజనం, నీరు, వసతి, ప్రసాదాలు, పారిశుధ్యం ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కోరానని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.