అగ్ని స్నానం చేసే అమ్మవారు….ఇడాన మాత ఆలయం

  • Publish Date - August 3, 2020 / 04:02 PM IST

భారతదేశంలో దేవతలకు, దేవుళ్లకు, స్వాములకు, బాబాలకు, మంత్రగాళ్లకు కొదవలేదు. సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో చిత్ర విచిత్ర మైన ఆలయాలు ఉన్నాయి. స్ధలమహత్యంతో భక్తులను రప్పించుకుంటున్నాయి. భక్తులు వందలకొలది కిలోమీటర్లు ప్రయాణించి ఆయా దేవీ, దేవుళ్ళను దర్శించుకుని ఉపశమనం పొందుతుంటారు. ఈ దేవాలయాలకు వెళ్లి వచ్చిన భక్తులు చిత్ర విచిత్రమైన వారి అనుభవాలు చెపుతూ ఉంటారు.



కొన్ని ఆలయాల్లో నీటితో దీపాలు వెలిగించి మహత్యం చూపిస్తే, కొన్ని ఆలయాల స్తంభాలు గాలిలో వేలాడుతూ ఉంటాయి. ఇందుకు సంబంధించి పరిశోధనలు చేసినప్పటికీ వాటికి గల కారణాలు ఎవరూ తెలుసుకోలేక పోయారు.

నాస్తిక వాదులు ఎంత మొత్తుకున్నా ఆస్తిక వాదులు అటువంటి ఆలయాలకు వెళ్లటం మాత్రం తగ్గలేదు. అలాంటి విచిత్ర మైన ఆలయం రాజస్ధాన్ లో ఒకటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారు అగ్నిని నీరుగా తీసుకుని స్నానం చేస్తుందని భక్తులు నమ్ముతారు. అదేంటో ఒకసారి చూద్దాం.



రాజస్థాన్ లోని ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఇడాన మాత ఆలయం ఉంది. అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది. అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది.

ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయానికి పైన రూఫ్ లేకుండా నిర్మించారు. ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంటుంది. ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇటీవల ఈ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక్కడ ఉన్న ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు. మంట దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది.


ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట.. ఎలా వస్తుందో తెలుసుకునేందుకో ఎంతో మంది ఎన్ని రకాలు పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు.

ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమి నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు.

ఈ మంటలను ప్రత్యక్షంగా చూసినవారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.



ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు.

ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పుజారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట.

ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా.. అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.