Heatwave Alert: బీకేర్ ఫుల్.. ఏపీకి తీవ్ర వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల హెచ్చరిక

ఉత్తరాంధ్రలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని వెల్లడించింది.

  • Updated on- April 22, 2026 / 06:25 PM IST

Heatwave Alert: ఏపీకి వడగాలుల హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో రేపు 95 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. మరో 101 మండలాల్లో సాధారణ వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఎల్లుండి కూడా 50 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. ఇక, కడపలో గరిష్ఠంగా 44.4°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 202 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.

ఉత్తరాంధ్రలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని వెల్లడించింది. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచనలు చేసింది.

వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంది. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సన్ గ్లాసెస్, తలకు రక్షణ (గొడుగు, క్యాప్, హెల్మెట్, క్లాత్) తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక, పొలాల్లో పని చేసే రైతులు చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలంది.

Also Read: వీవోఏల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. రూ.22 కోట్లు విడుదల