AP Heatwave: బీకేర్ ఫుల్.. బయటకు రావొద్దు.. ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు

Heatwave Alert In AP: 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందంది. 55 మండలాల్లో సాధారణ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది.

  • Updated on- April 16, 2026 / 09:26 PM IST

AP Heatwave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు ప్రభావం చూపుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 215 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రేపు (ఏప్రిల్ 17) 43°C నుంచి 44.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది. మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందంది. 55 మండలాల్లో సాధారణ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాంధ్రలో పలు మండలాలకు తీవ్ర వడగాలుల అలర్ట్ ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. శనివారం కూడా వడగాలుల ప్రభావం కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 3 మండలాల్లో తీవ్ర, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది, కడప ఒంటిమిట్టలో 44.9°C, మార్కాపురం అనుమలపల్లిలో 44.2°C నమోదైంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. గుండె, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగొద్దని హెచ్చరించింది. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని.. వేడిగాలి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Also Read: డీలిమిటేషన్ రచ్చ.. ఏపీ, తెలంగాలో ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయో చెప్పిన అమిత్ షా..