విషం కలిపిన ఆహారం పెట్టి..ఇంజెక్షన్ చేసి..భర్త, పిల్లల్ని చంపి..డాక్టర్ ఆత్మహత్య
ఏం కష్టమొచ్చిందో ఏమో…ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ తన భర్తను..ఇద్దరు పిల్లల్నీ చేతులారా చంపేసింది. ఆపై ఇంజెక్షన్ చేసింది. తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. డాక్టర్ సుష్మ రాణె డాక్టర్ గా మంచి పేరున్న మహిళ. ఆమె భర్త ధీరజ్ (42) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరికి 11, 5 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధీరజ్ తల్లి (60)తో కలిసి నాగ్ పూర్ లోని కొరాడి ప్రాంతంలోని ఓం నగర్ లో ఉంటున్నారు. ప్రతీరోజులాగే మంగళవారం (ఆగస్టు 18,2020) రాత్రి గడిచింది. కానీ ఉదయం లేచేసరికల్లా జరగరాని ఘోరం జరిగిపోయింది.
ఉదయం నిద్రలేచిన ధీరజ్ తల్లి కొడుకుని కోడలు ఎంతకీ నిద్ర లేవకపోవటంతో బెడ్రూం దగ్గరకొచ్చి పిలిచింది. కానీ ఎటువంటి స్పందనా లేదు. మళ్లీ మళ్లీ పిలిచింది. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో భయపడింది. బెడ్రూమ్ డోర్స్ తీయటానికి ఎంతగా యత్నించినా కుదరలేదు.
అనుమానించిన ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే వచ్చిన పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించి అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. ధీరజ్, ఇద్దరు పిల్లలు బెడ్మీద విగతజీవులుగా పడి ఉండగా, డాక్టర్ సుష్మ మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది.తన జీవితంలో ఆనందం లేదనీ..ఇటువంటి జీవితం వద్దనీ..అందుకే ఇలా అంటూ ..వివరాలు రాసిన డాక్టర్ సుష్మ రాసిన సూసైడ్ నోట్ను ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భర్త, పిల్లలను చంపేందుకు ఉపయోగించిన రెండు సిరింజిలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తొలుత విషం కలిపిన ఆహారాన్ని భర్త, పిల్లలకు తినిపించిన సుష్మ, ఆపై గుర్తు తెలియని ఓ ఇంజక్షన్ ఇచ్చి వారిని చంపి తరువాత ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారికేమన్నా ఆర్థిక సమస్యలున్నాయా? లేదా కుటుంబంలో కలహాలు ఉన్నాయా? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ సుష్మ అత్తగారిని ప్రశ్నిస్తున్నారు.