IND vs AUS 3rd ODI: మూడో వ‌న్డేకు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌

మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఆస్ట్రేలియాపై వ‌న్డే సిరీస్‌ను సొంతం చేసుకుని జోష్‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు షాక్ త‌గిలింది.

Ashwin-Axar Patel

India vs Australia : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఆస్ట్రేలియాపై వ‌న్డే సిరీస్‌ను సొంతం చేసుకుని జోష్‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు షాక్ త‌గిలింది. ఆసీస్‌తో నామ‌మాత్ర‌మైన మూడో వ‌న్డేకు ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ (Axar Patel) దూరం అయ్యాడు. ఆసియా క‌ప్ 2023లో సూప‌ర్‌-4 ద‌శ‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డిన అక్ష‌ర్ ప‌టేల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్ర‌మంలో అత‌డు మూడో వ‌న్డేకు సైతం దూరం కానున్న‌ట్లు ప్ర‌ముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బ‌జ్ తెలిపింది. దీంతో మూడో వ‌న్డేలో సైతం అశ్విన్ ఆడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అక్ష‌ర్ ప‌టేల్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (NCA) లో కోలుకుంటున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభానికి మ‌రో 10 రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో ఆలోగా అక్ష‌ర్ ప‌టేల్ కోలుకుంటాడా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే.. అక్ష‌ర్ వార్మ‌ప్ మ్యాచుల‌ క‌ల్లా అందుబాటులోకి వ‌స్తాడ‌ని ఉంటాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు అంటున్నాయి. అక్ష‌ర్ పటేల్ స్థానంలో ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌కు ఎంపికైన సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో 4 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటాడు.

Also Read: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. శ్రీలంకపై భారత్ ఉమెన్స్ జట్టు ఘన విజయం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే ఆట‌గాళ్ల జాబితాను ఇప్పటికే బీసీసీఐ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌ట్టులో అశ్విన్‌కు చోటు ద‌క్క‌లేదు. అయితే.. అనుకోకుండా అక్ష‌ర్ ప‌టేల్ గాయప‌డ‌డంతో అశ్విన్‌ను ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. దాదాపు సంవ‌త్స‌రం త‌రువాత అశ్విన్ వ‌న్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అక్ష‌ర్ ప‌టేల్ ఫిట్నెస్ సాధించి అందుబాటులోకి వ‌స్తే ప‌రిస్థితి ఏంటి..? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. అత‌డిని నేరుగా ప్ర‌పంచ‌క‌ప్ ఆడిస్తారా..? లేదంటే అశ్విన్‌ను ఎంపిక చేస్తారా..? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అశ్విన్ కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని మాజీ ఆట‌గాళ్లు చెబుతుండ‌గా, స్వ‌దేశంలో ఆసీస్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో అశ్విన్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

సీనియ‌ర్లు వ‌చ్చేస్తున్నారు
వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండ‌ర్ హ‌ర్దిక్ పాండ్య‌ల‌తో పాటు స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ల‌కు ఆసీస్‌తో మొద‌టి రెండు వ‌న్డేల‌కు విశ్రాంతి ఇచ్చారు. కాగా.. వీరంతా మూడో వ‌న్డేకు అందుబాటులోకి వ‌చ్చారు. రాజ్‌కోట్ వేదిక‌గా అక్టోబ‌ర్ 27న జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే కోసం ఇప్ప‌టికే వీరు జ‌ట్టుతో చేరారు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముందు టీమ్ఇండియా ఆడుతున్న చివ‌రి వ‌న్డే మ్యాచ్ ఇదే కావ‌డంతో అభిమానుల దృష్టి అంతా ఈ మ్యాచ్‌పైనే ఉంది. విజ‌యంతో ప్ర‌పంచ‌క‌ప్‌లో అడుగుపెట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: ఆసియా క్రీడల్లో భారత ఎయిర్ రైఫిల్ టీమ్ వరల్డ్ రికార్డ్.. మొదటి స్వర్ణ పతకం

ట్రెండింగ్ వార్తలు