Seed Quality : విత్తనం నాణ్యత, జన్యు స్వచ్చతపైన పంట దిగుబడులు.. రైతు స్థాయిలో విత్తనోత్పత్తికి సూచనలు
వరిసాగులో ప్రాంతానికి అనుగుణంగా ఎన్నో రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే అనేక సంవత్సరాలపాటు వీటిని ఇతర రకాల మధ్య సాగుచేయటం వల్ల వీటి జన్యుస్వచ్ఛత కొంత దెబ్బతినే ప్రమాధముంది. దీనికి తోడు ఇతర రకాల విత్తనాలతో కలిసినప్పుడు కేళీలు ఎక్కువగా వచ్చి రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదముంది.
- Guntupalli Ramakrishna
- Published On : March 28, 2023 / 09:03 AM IST
Seed Production
Seed Quality : విత్తుకొద్దీ పంట అని నానుడి. విత్తనం నాణ్యత, జన్యు స్వచ్చతపైన పంట దిగుబడి ఆధారపడి వుంటుందనటంలో సందేహం లేదు. ఇక సాగులో అధిక దిగుబడి సాధించటానికి, మనం చేపట్టే యాజమాన్య, సస్యరక్షణ చర్యలు కీలక భూమిక పోషిస్తాయి. వీటన్నిటి కలయికే నాణ్యమైన విత్తనోత్పత్తి. తెలుగురాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా దాదాపు 42 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. మరి ఇంత విస్తీర్ణానికి విత్తనం సరఫరా చేయాలంటే విత్తన సంస్థలకు… రైతులు, పరిశోధనాస్థానాల తోడ్పాటు తప్పనిసరి. స్వంతంగా విత్తనం తయారుచేసుకోవటం వల్ల రైతుకు ఖర్చు తగ్గటంతో పాటు… కొంత అదనపు ఆదాయం లభించే అవకాశం వుంది. అయితే నాణ్యమైన విత్తనం తయారు ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.
READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!
వరిసాగులో ప్రాంతానికి అనుగుణంగా ఎన్నో రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే అనేక సంవత్సరాలపాటు వీటిని ఇతర రకాల మధ్య సాగుచేయటం వల్ల వీటి జన్యుస్వచ్ఛత కొంత దెబ్బతినే ప్రమాధముంది. దీనికి తోడు ఇతర రకాల విత్తనాలతో కలిసినప్పుడు కేళీలు ఎక్కువగా వచ్చి రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదముంది. దీన్ని అదిగమించేందుకు విత్తన సంస్థలు ఏటా, జన్యుస్వచ్చత వున్న మూల విత్తనాన్ని రైతులకు అందించి విత్తనోత్పత్తికి ప్రోత్సహిస్తున్నాయి.
రైతులు పండించే ఈ విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్ అంటారు. దీన్ని రైతుల వద్దనుంచి బైబ్యాక్ ఒప్పందంతో విత్తన సంస్థలు తిరిగి సేకరించి, ట్రూత్ ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలుగా మార్కెట్లో విక్రయిస్తాయి. విత్తనం కనీస నాణ్యాతా ప్రమాణాలు కలిగి, అధిక జన్యు స్వచ్ఛత, మొలక శాతం, తక్కువ మలినాలు కలిగి, తెగుళ్లబారిన పడని విత్తనాన్ని నాణ్యమైన విత్తనంగా పేర్కొంటారు. ఈ విత్తనోత్పత్తి వల్ల రైతుకు బస్తాకు 500 నుంచి 1000 రూపాయలు అదనంగా లభించే అవకాశముంది. అయితే ఇప్పటికే రబీ వరి సాగు పిలక దశలో ఉంది. రైతులే స్వంతంగా నాణ్యమైన విత్తనోత్పత్తిని చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
READ ALSO : Black Thrips Pest : మామిడి, బొప్పాయితో పాటు ఇతర ఉద్యానవన తోటల్లో నలుపు రంగు తామర పురుగుల నియంత్రణ!
పెరుగుతున్న జనభా ఒకవైపు, తరుగుతున్న సహజ వనరులు మరోవైపు . ఇలాంటి పరిస్థితుల్లో ఆహార భద్రతను కల్పించాలంటే, ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను అధికం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలు, రైతులకు అందుబాటులో ఉన్నా, విత్తనాభివృద్ధి సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానాలు, ప్రైవేట్ విత్తన సంస్థలు రైతులందరికీ సరఫరా చేయలేవు. కాబట్టి రైతులు తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. టి. శ్రీనివాస్ తెలియజేస్తున్నారు.
