×
Ad

Anguilla Fish Farming : ఇంగిలాయి చేపల పెంపకం.. కిలో ధర రూ.320 పైనే.. భారీ లాభాలు ఆర్జిస్తున్న యువ రైతు

Anguilla Fish Farming : అంతరించి పోతున్న ఈ చేపలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో, లాభాలు కూడా అదేస్థాయిలో ఆర్జిస్తున్నారు. ఇంతకీ ఇంగిలాయి చేపల పెంపకంలో ఆయన అనుభవాలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం...

  • Published On : November 10, 2025 / 11:24 AM IST

Huge Earnings With Anguilla Fish Farming

Anguilla Fish Farming : మనకు తెల్ల చేపలు, రొయ్యల పెంపకం గురించి తెలుసు. కానీ సహజ సిద్ధంగా దొరికే ఇంగిలాయి చేపలను ప్రయోగాత్మకంగా పెంచి విజయం సాధించారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు. అంతరించి పోతున్న ఈ చేపలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో, లాభాలు కూడా అదేస్థాయిలో ఆర్జిస్తున్నారు. ఇంతకీ ఇంగిలాయి చేపల పెంపకంలో ఆయన అనుభవాలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం..

ఇదిగో ఇక్కడ చేపలు (Anguilla Fish Farming) పడుతున్న ఈ చెరువు ఏలూరు జిల్లా, మండవల్లి మండలం, గన్నవరం గ్రామంలో ఉంది. ఇక్కడే కష్టాన్ని విజయంగా మార్చుకున్న యువరైతు కూనపరాజు నాగరాజు కథ మొదలైంది. గతంలో తెల్ల చేపలు, రొయ్యల పెంపకం చేపట్టిన ఈయనకి… వ్యాధులు, పెట్టుబడులు, నష్టాలు ఇవన్నీ ఒక దశలో భారం అయ్యాయి. అయితే వెనక్కి తగ్గకుండా… కొత్త ప్రయోగం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

అలా అంతరించి పోతున్న ఇంగిలాయి చేపలను 2 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. మొదటి ప్రయత్నమే పెద్ద విజయంగా మారింది. పెరుగుదల బాగుండటంతో పాటు, మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ రావడంతో, పశ్చిమ బెంగాల్ నుండి వ్యాపారులు స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

ఇంగిలాయి చేపలు కిలో ధర రూ.320 పైనే పలుకుతుండటంతో, ఇతర చేపలతో పోల్చితే మంచి లాభాలు వస్తున్నాయని నాగరాజు చెబుతున్నారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు… యువరైతు పట్టుదల, ఆలోచన, ఆవిష్కరణకు నిలువెత్తు నిదర్శనం . అంతరించి పోతున్న చేప జాతిని రక్షిస్తూ… లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.