Papaya Cultivation : మెట్టప్రాంతాల్లోని రైతులకు బొప్పాయి సాగు లాభసాటిగా మారింది . బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో నానాటికీ వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా వుంది. అందుకే వీటి సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. పండ్లతోటల సాగులో రైతులంతా, ఇప్పుడు నర్సిరీలపైనే ఆదారపడుతున్నారు.
అందుకు తగ్గట్టుగానే నర్సరీలు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో, మొక్కలను అభివృద్ది పరిచి, రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు షేడ్ నెట్ కింద బొప్పాయి నర్సరీ పెంచి మంచి లాభాలను పొందుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయికి, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్ లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా వుండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ.. మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు.
అయితే, ఏ తోట అభివృద్ది అయినా నాణ్యమైన జాతిమొక్కల పైనే ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మొదటి ఏడాదిలోనే ఏదైనా తప్పు జరిగితే, ఆ తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులకు, తోట దిగుబడి, ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోనే పండ్లతోటలను సాగుచేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆదారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే, నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా, రైతులకు కావల్సిన రకాలను అభివృద్ది చేసి అందిస్తున్నాయి.