Superior Ownership in Sugarcane Cultivation
Sugarcane Cultivation : చెరకు నాటే సమయం ఆసన్నమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4లక్షల 72వేల ఎకరాల్లో చెరకు సాగుచేస్తున్నారు. చెరకుసాగులో రైతు ఏడాదికాలంపాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి వుంది. కనుక నాటే సమయంలో విత్తనం ఎంపికలో తగిన మెళకువలు పాటించి, యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. వివరాలను కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్ర్రవేత్త డా. పొట్లూరు షేక్ స్పియర్ ద్వారా తెలుసుకుందాం.
Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు
తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3 లక్షల 74వేల ఎకరాల్లో సాగువుతుండగా, తెలంగాణలో లక్షా 25 వేల ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం వుంది. ప్రస్థుతం చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా, చెరకు నరికిన రైతాంగం కార్శి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు. తెలంగాణలో జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది.
ప్రస్థుతం కొంతమంది రైతులు వరిమాగాణుల్లో ముందస్తుగా నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చెరకులో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు అందుబాటులో వున్నాయి. 10 నుంచి 12 నెలల వ్యధిలో పక్వతకు వచ్చే ఈ రకాల్లో, రైతులు మేలైన రకాలను ఎంచుకుని, స్వల్పకాలిక రకాలను 40 శాతం, మధ్య, దీర్ఘకాలిక రకాలను 60 శాతం చొప్పున నాటుకుంటే పంట ఒకేసారి పక్వతకు రాకుండా దఫదఫాలుగా కోతకు వచ్చే వీలుంది. దీనివల్ల సరైన పక్వదశలో ఫ్యాక్టరీకి సరఫరాచేయటానికి, ఎక్కువకాలం ఫ్యాక్టరీ నడిచేందుకు వీలుంటుంది. చెరకు మొక్కతోట నాటేటప్పుడు యాజమాన్యంలో రాజీపడకుండా ముందడుగు వేయాలని సూచిస్తున్నారు ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. పొట్లూరు షేక్ స్పియర్.
చెరకు సాగులో విత్తన ఎంపిక అనేది, కీలకమైన అంశం. ఏడెనిమిది నెలల వయసు వున్న లేవడి తోటల నుంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి. ముదురుతోటల నుంచి విత్తనం సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, పూత పూయని తోటలను ఎన్నుకోవాలి. చెరకును నరికిన తర్వాత, చెరకు గడపైన వున్న 3వంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి. ఎందుకంటే గడ కింది భాగంలో షుక్రోజ్ శాతం అధికంగా వుండి, నీటి శాతం తక్కువ వుంటుంది.
గడలో తేమ శాతం అధికంగా వున్నప్పుడు మాత్రమే, విత్తనం నుంచి మొలక శాతం ఆశాజనకంగా వుంటుంది. అందువల్ల లేత భాగాలను విత్తనంగా ఉపయోగించటం ఉత్తమం. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు, 67కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. మొత్తం భాస్వరం, పొటాష్ ను ఆఖరి దుక్కిలో వేయాలి.నత్రజనిని మొక్క మొలిచిన 45, 90 రోజులకు రెండు దఫాలుగా వేయాలి. సాధారణ పద్ధతిలో రైతులు ఎకరాకు 3 నుంచి 4 టన్నుల మూడుకళ్ల ముచ్చెలను విత్తనంగా వాడుతున్నారు. అయితే నాటేటప్పుడు విత్తనపు ముచ్చెల సంఖ్య తగ్గకుండా జాగ్రత్త వహించాలంటారు డా. పొట్లూరి.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..