Groundnut crop : వేరు శెనగలో తాలు నివారణకు జిప్సం వాడకం!
జిప్సంను తొలిపూత సమయంలో చాళ్లలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎతతోయాలి. వర్షాభావ పరిస్ధితుల్లో ఊడలు దిగే సమయంలో విత్తిన 45 రోజులకు రెండో సారి కలుపు తీసే సమయంలో వేయాలి.
- Guntupalli Ramakrishna
- Published On : April 19, 2022 / 05:02 PM IST
Groundnut Crop
Groundnut crop : వేరుశెనగ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సేంద్రీయ, రసాయన ఎరువులతోపాటు జిప్సం వినియోగం అవసరమేనని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. జిప్సం వాడకం వల తాలు కాయలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా కాయల్లో గింజలు నిండుగా ఉంటాయి. కాయ లపై తొక్క గట్టిగా , బరువుగా ఉంటుంది. కాల్షియం నేలను గుల్లరిచి పోషకాలను వేర్లు తీసుకునేందుకు సహకరిస్తుంది. నేలలో ఊడలు సులభంగా దిగుతాయి. గింజలు బలంగా ఉండి కాయల్లో పప్పు శాతం పెరుగుతుంది. పైరుకు ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది.
జిప్సంలోని గంధకం, ఎంజైములు, ప్రొటీన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. కాయల్లో నూనె శాతం పెరుగుతుంది. ఆకులు త్వరగా పండి పోకుండా ఉంటాయి. వేరు శెనగలో కాల్షియం లోపం కారణంగా లేత ఆకులు ముడుచుకుని వంకర తిరుగుతాయి. ఆకు కొనల నుండి అంచుల వెంట ఎండిపోతుంది. వేర్లు పెరగవు. జిప్సం వాడకంతో వీటిని నివారించ వచ్చు.
జిప్సంను తొలిపూత సమయంలో చాళ్లలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎతతోయాలి. వర్షాభావ పరిస్ధితుల్లో ఊడలు దిగే సమయంలో విత్తిన 45 రోజులకు రెండో సారి కలుపు తీసే సమయంలో వేయాలి. మొదళ్ల వద్ద మొక్కకు ఐదు సెంటీమీటర్ల వెడంతో 5 సెంటీమీటర్ల లోతులో వేసి మట్టి కప్పాలి. ఎకరాకు 200 కిలోల జిప్సం ను మెత్తగా పొడి చేసి వేయాలి. జిప్సం ను వేరు శెనగ పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
