ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7వ కేసు నమోదైంది. విశాఖకు చెందిన 25ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అతడు ఇటీవలే యూకే నుంచి విశాఖపట్నం వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతడి నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇప్పటివరకు విశాఖలో 3 పాజిటివ్ కేసులు నమోదు కావడం స్థానికుల్లో ఆందోళన నింపింది. ఇటీవలే మక్కా నుంచి వచ్చిన వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. అతడి భార్యకూ కరోనా సోకింది. ఇప్పుడు విశాఖలోనే మరో పాజిటివ్ కేసు నమోదైంది.
బాధితుడిది గోపాలపట్నం. యూకే నుంచి వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, విశాఖలో అనుమానిత కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉండటంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో విదేశాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. ఎయిర్ పోర్టులో దిగినప్పుడు స్క్రీనింగ్ పరీక్షల్లో ఎలాంటి లక్షణాలు బయటపడటం లేదు.
కొన్ని రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతున్నాయి. మరోవైపు విశాఖలోని తగరపువలస, పద్మనాభంలో రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయి. దుబాయ్, లండన్ నుంచి వచ్చిన వ్యక్తుల్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అలర్ట్ అయిన అధికారులు వెంటనే వారిని చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. వారి నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు. రిపోర్టులు వచ్చే దాకా ఐసోలేషన్ వార్డులోనే వారిని ఉంచాలని అధికారులు ఆదేశించారు.