Chandrababu Bail : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా.. న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
విచారణకు చంద్రబాబు సహకరించడం లేదని, మరో 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును సీఐడీ కోరింది. Chandrababu Bail
- Naveen
- Published On : September 25, 2023 / 04:39 PM IST
Chandrababu Bail Petition
Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశించాయి. కానీ, అలా జరగలేదు. నిరీక్షణ తప్పడం లేదు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విజయవాడ ఏసీబీ కోర్టు విచారణను రేపటికి (సెప్టెంబర్ 26) వాయిదా వేసింది. ఇరువర్గాల వాదనలను రేపు వింటామని వెల్లడించింది.
చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు పిటిషన్ వేశారు. చంద్రబాబును మరోసారి తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ తరపు లాయర్లు కూడా పిటిషన్ వేశారు. కేసు విచారణకు చంద్రబాబు సహకరించడం లేదని, మరో 5 రోజుల పాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును సీఐడీ కోరింది. సీఐడీ కస్టడీ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్లను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
Also Read..YCP MLAs: జగన్ పెట్టిన టెస్ట్లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?
అయితే, బెయిల్ పిటిషన్ పై ముందుగా వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాది దూబె జడ్జిని కోరారు. బెయిల్ పిటిషన్ కన్నా ముందుగా కస్టడీ పిటిషన్ పై వాదనలు వినాలని సీఐడీ తరపు లాయర్ జడ్జికి విజ్ఞప్తి చేశారు. వివిధ కోర్టు తీర్పులు ఉదహరిస్తూ కస్టడీ పిటిషన్ పైనే విచారణ చేపట్టాలని చెప్పారు. దీనిపై చాలా సేపు చర్చ జరిగింది. ఎంత సేపటికీ చర్చ తెగకపోవడంతో రేపు ముందు ఏ పిటిషన్ పై వాదనలు వినాలో నిర్ణయిస్తాను అని జడ్జి చెప్పారు. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేశారు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.
”చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని సీఐడీ తరపు లాయర్లు నిన్న మెమో వేశారు. అదే సమయంలో నిన్ననే కస్టడీ పిటిషన్ పైనా మెమో దాఖలు చేసి ఉండాల్సింది. గ్యాప్ వచ్చింది కాబట్టి మెయింటైన్ బుల్ కాదని మేము వాదనలు వినిపిస్తాం. ఈ కస్టడీ మెమోపై మీరు(జడ్జి) ఉత్తర్వులు జారీ చేస్తే మేము బెయిల్ అప్లికేషన్ మీద వాదనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని న్యాయమూర్తికి చెప్పాము.
సీఐడీ తరపు లాయర్లు కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ను ప్రస్తావించారు. కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉండగా బెయిల్ పిటిషన్ పై వాదనలు వినడానికి వీల్లేదని జడ్జితో చెప్పారు. మీరు మెమో వేశారు. మీ మెమోని నేను పరిగణలోకి తీసుకోలేను. మెమో మీద నేను సంతకం కూడా చేయలేదు. కాబట్టి ఆ మెమో ఆర్డర్స్ నేను ఏమీ పాస్ చేయడం లేదు కాబట్టి బెయిల్ అప్లికేషన్ మీద ఆర్గుమెంట్స్ వినండి అని న్యాయమూర్తి అన్నారు” అని సీనియర్ న్యాయవాది కృష్ణమూర్తి తెలిపారు.
మొత్తంగా బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయి. దీనికి సంబంధించి ఎవరూ వినని పక్షంలో ఏ పిటిషన్ పై ముందుగా వాదనలు వినాలి అనేది నేనే రేపు నిర్ణయిస్తాను అని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
