అందుకే మళ్లీ వైసీపీలో చేరాను: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
తాను రెండు నెలలు పక్కకి వెళ్లానని, మళ్లీ జగన్ బాటలో నడవాలని..
- T Venkateshwarlu
- Published On : February 20, 2024 / 03:22 PM IST
Alla Ramakrishna Reddy
Alla Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాక ఆయన మీడియాతో మాట్లాడారు.
మంగళగిరిలో వైసీపీని మూడోసారి గెలిపించడానికి తిరిగి పార్టీలోకి వచ్చానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాను రెండు నెలలు పక్కకి వెళ్లానని, మళ్లీ జగన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారని చెప్పారు. మారో 20 ఏళ్లు ఆయన సీఎంగా ఉండాలని అన్నారు.
జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రంలో పేదల భవిష్యత్తు మారుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 లోక్సభ సీట్లు సాధించే యజ్ఞంలో తానూ భాగమవుతానని తెలిపారు. మంగళగిరిలో ఎవరు బరిలో ఉన్నా గెలుపునకు తాను పని చేస్తానని చెప్పారు.
అప్పట్లో వైఎస్సార్ పైకి ప్రతిపక్షాలు అన్ని వచ్చాయని, ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అయ్యిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో తన చేతుల్లో లోకేశ్ ఓడిపోయారని, 2024లోనూ బీసీ చేతిలో లోకేశ్ ఓడిపోతారని చెప్పారు. తన సేవలు ఏ నియోజకవర్గంలో అవసరమో అక్కడ పని చేస్తానని అన్నారు. మంగళగిరిలో తాను అడిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా సీఎం జగన్ చూశారని చెప్పారు.
Read Also: జగన్ తికమక.. డ్రామాలో భాగంగానే షర్మిల వద్దకు ఆర్కే.. ఇప్పుడు వైసీపీలోకి: మాజీ మంత్రి జవహర్
