Amaravati Farmers Yatra
Amaravati Farmers Yatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. ఇవాళ బాపట్ల జిల్లా నగరం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం మంచిదే అని రాజధాని రైతులు అంటుండడం గమనార్హం. ఎందుకంటే సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడంతో మూడు రాజధానులపై అటో ఇటో తేలిపోతుందని చెప్పారు. సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలక తప్పదని అన్నారు. చివరకు విజయం సాధించేది తామేనని చెప్పారు.
రైతుల పాదయాత్రకు పలు రంగాల వారు మద్దతు తెలుపుతున్నారు. కాగా, నిన్న చెరుకుపల్లి మండలం ఐలవరం శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కనగాల మీదగా గూడవల్లి శివారు నుంచి రాజోలు వైపు కొనసాగింది. తూర్పుపాలెం మీదుగా నగరం చేరుకోవడంతో అక్కడ యాత్రకు విరామం ఇచ్చి ఇవాళ మళ్ళీ అక్కడి నుంచే యాత్ర ప్రారంభించారు. నిన్న 15 కిలోమీటర్ల మేర మహా పాదయాత్ర కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి రైతులు వచ్చి పాదయాత్రకు మద్దతు తెలిపారు.