Ambati Rambabu
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ను ఓడించడం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కల్యాణ్ ( Pawan Kalyan), లోకేశ్ (Lokesh) వల్ల కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… రైతు ఇబ్బంది పడితే సహించే ప్రభుత్వం తమది కాదని చెప్పారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని అంబటి రాంబాబు అన్నారు. అది పూర్తయితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబేనని విమర్శించారు. డయాఫాం వాల్ కట్టకుండా కాపర్ డాం కట్టిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబువి అన్నీ చారిత్రిక తప్పిదాలని చెప్పారు.
అవగాహన లేక చంద్రబాబు చేసిన తప్పు వల్ల రూ.2,022 కోట్లు పోలవరంపై అదనపు భారం పడిందని అంబటి రాంబాబు అన్నారు. ఎక్కడ డబ్బులు వస్తాయి? ఎక్కడ తినేద్దామన్న ఆలోచన తప్ప చంద్రబాబుకు ఇంకో ఆలోచన లేదని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ అని కేంద్రం ప్రకటించగానే.. దాన్ని తాను కడతానని చంద్రబాబు అన్నారని తెలిపారు. చంద్రబాబు వల్ల రూ.55 వేల కోట్లు వెచ్చించే పరిస్థితి ఇప్పుడు వచ్చిందని చెప్పారు.
జగన్ పదేపదే ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి ప్రాజెక్టులను గాడిన పెట్టేందుకు యత్నిస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా అమలు చేయలేనన్ని పథకాలను జగన్ అందిస్తున్నారని చెప్పారు. రూ.2 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు అందించిన జగన్ ను ఒడిస్తారా? అని ప్రశ్నించారు. లోకేశ్ యువగళం యాత్ర గురించి తాము మాట్లాడితే తప్ప వాళ్ల ఇంట్లో వారికి కూడా అది జరుగుతుందనేది తెలియదని ఎద్దేవా చేశారు.
YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు