AP Volunteers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గ్రామవార్డు వాలంటీర్ల విషయంలో జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని నేరుగా ఆదేశాలిచ్చారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తక్షణమే తొలగించాలన్నారు.
Read Also : Petrol Diesel Prices : కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు, లీటర్పై ఎంత తగ్గిందంటే..
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్నిరకాల ఎన్నికల విధుల నుంచి తక్షణం తొలగించాలని కలెక్టర్లకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా అది ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని సీఎస్ స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లు అర్హులు కారని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే కోడ్ అమల్లోకి వస్తోంది. ఈ క్రమంలోనే జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. ఏపీలో విపక్షాలు వాలంటీర్ల పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి.