కర్నూలు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు: ఇంతియాజ్

IAS officer Imtiaz to contest kurnool assembly seat

IAS officer Imtiaz: కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు వైసీపీలో చేరిన ఐఎఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ తెలిపారు. గురువారం సీఎం జగన్ సమక్షంలో ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్నూలు నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. అసమానతలు లేని సమాజం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తున్నారని చెప్పారు.

కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన తాను అక్కడే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసినట్టు తెలిపారు. వైసీపీ చేస్తోన్న సంక్షేమ అభివృద్ది పథకాలతో ప్రజలకు న్యాయం జరుగుతోందని అన్నారు. సీఎం జగన్ అందిస్తోన్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడినై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పారు. కాగా, కర్నూలు అసెంబ్లీ అభ్షర్థిగా ఇంతియాజ్ ను నియమించినట్లు జిల్లా నేతలకు సీఎం జగన్ తెలిపారు.

స్వాగతిస్తున్నాం: రామసుబ్బారెడ్డి
మైనార్టీ వెల్ఫేర్ శాఖలో కీలక అధికారిగా పని చేసిన ఇంతియాజ్ తమ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేయాలని భావించి ఇంతియాజ్ తమ పార్టీలోకి వచ్చారని వెల్లడించారు. కర్నూలు నుంచి ఇంతియాజ్ పోటీ చేయించాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. ఇంతియాజ్ అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మద్దతిస్తారని.. అందరూ కలసి ఎమ్మెల్యేగా ఆయనను గెలిపించాలని కోరారు.

Also Read: చంద్రబాబు చుట్టూ పవన్ తిరుగుతున్నారు.. మహిళల గురించి బండ్ల గణేశ్ నీచంగా..: రోజా

ఎక్కడా పోటీ చేయను: హఫీజ్ ఖాన్
ఈసారి ఎన్నికల్లో ఎక్కడా తాను పోటీ చేయడం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు. పార్టీ పరంగా తన సేవలను వినియోగించుకుంటారని.. తగిన ప్రాధాన్యం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. నంద్యాల ఎంపీ సీటు ముస్లింలకు ఇచ్చే ప్రతిపాదనపై ఎటువంటి చర్చ లేదన్నారు. కలసి కట్టుగా పనిచేసి ఇంతియాజ్ ను గెలిపించుకుంటామన్నారు. తాను పోటీ చేయడం లేదని కార్యకర్తలు కొందరు ఎమోషనల్ అయ్యారని.. తొందరలోనే వారంతా సర్దుకుంటారని అన్నారు.

Also Read: వారి కోసం.. వైసీపీ మ్యానిఫెస్టోలో కొత్త పథకాలు..!

ఇంతియాజ్‌కు సపోర్టు చేస్తాం: ఎస్వీ మోహన్ రెడ్డి
తనకు మంచి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ బాగుంటే తాము బాగుంటామని, ఇంతియాజ్‌కు తాముంతా సపోర్టు చేస్తామన్నారు. కర్నూలుకు ఇంతియాజ్ సుపరిచితులని, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు