Ap Night Curfew: తగ్గిన కరోనా కేసులు.. ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడగింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆంక్షల్ని మరికొన్నిరోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
- vamsi
- Updated on- October 16, 2021 / 12:34 PM IST
Night Curfew In Andhrapradesh
Ap Night Curfew: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆంక్షల్ని మరికొన్నిరోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రోజూ రాత్రి 12గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది ప్రభుత్వం. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం-2005, ఐపీసీ సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పెళ్లిళ్లు, శుభకార్యాలకు 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. కరోనా ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం. ఏపీలో ఈ నెలాఖరు వరకు అంటే అక్టోబర్ 31వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనల మేరకు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ, పండుగల సీజన్, థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తుండడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏపీలో 24 గంటల వ్యవధిలో 38వేల 786 కరోనా పరీక్షలు చేయగా 517 మందికి వైరస్ సోకినట్లు వెల్లడైంది. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 826 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
